రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిదని, కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (PMT,PET) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా… 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో కానిస్టేబుల్‌ (సివిల్‌)- 3,580, కానిస్టేబుల్‌ (ఏపీఎస్‌పీ) -2,520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిరదన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు 3,622 మంది హోంగార్డులు హాజరుకాగా 382 మంది అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో 14 రిట్‌ పిటిషన్లు వేశార న్నారు. ప్రత్యేక కేటగిరీ కోటాలో ప్రత్యేక మెరిట్‌ జాబితా ను ప్రకటించాలని వారు కోర్టును ఆశ్రయించారన్నారు. వీరిని తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వివరించారు. న్యాయ సలహా తీసుకొని… ఆ సలహా మేరకు రెండవ దశ (పీఎంటీ, పీఈటీ)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలను స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని మంత్రి అనిత పేర్కొన్నారు. రెండోదశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష (ఫైనల్‌ రాత పరీక్ష) జరుగుతుందని ఆమె తెలిపారు.

Share.
Exit mobile version